Sunday, July 24, 2011

మృత్యు మంజూష


భయమంటే నాకు చాలా భయం ! అందుకే ఎప్పుడూ దగ్గరకి రానివ్వ లేదు . నిప్పు , నీరు , నింగి , నేల , మనుషులు , జంతువులు , ఆకలి , అప్పులు , ఏవీ నన్ను భయ పెట్ట లేక పోయాయి . కాక పొతే ఒక్కో అనుభవం ఒక్కో పాఠాన్ని నేర్పాయంతే . ఎలా ఉండాలో కొన్ని , ఎలా వుండ కూడదో కొన్ని .
చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు , కోతి కొమ్మచ్చి లాటలలో చెట్లేక్కేటప్పుడు , వేసవి మధ్యాహ్నాలు మామిడి తోటలలో కాయలు కోసుకుని తోట మాలి అరుస్తుంటే పక్కనే వున్న ఏట్లోకి దూకేసి నప్పుడు , చినచిన్న దెబ్బలు తగిలినా ఎప్పుడూ భయపడలేదు. స్నానాలు చేసి తడి బట్లతో ఇల్లు చేరి నానమ్మ చేత మిత్రులంతా మూకుమ్మడిగా తిట్లు తిని వాటితో బాటు తాయిలాలూ తినేసి తిరిగి ఆటకి తయారు .
ఆట లక్ష్యం గెలుపో ఓటమో కాదు కేవలం ఆడడం అంతే. .
జీవిత పరమార్థం కూడా కేవలం జీవించడం , జీవితాన్ని యధాతధం గా ఆశ్వాదించడం అంతే కన్నీరు , చిరునవ్వూ , కస్టాలూ , సుఖాలూ , సౌఖ్యాలూ , గెలుపులూ ,ఓటమిలూ ...యివన్నీ ప్రతీ జీవితానికీ అంతర్లీన స్రవంతి గా ఎదురయ్యేవి . ఈ జీవన సత్యాన్నే మా తరానికి బాల్యం ఆటలయినా , బామ్మలయినా నేర్పినది . స్కూల్ లో చదువుకునే రోజులలో లెక్కలంటే బోలెడు భయ పడాలన్నారు , ఎక్కాలని వల్లే వేయించాడు తాతయ్య , ` జ్ఞాపకమే జ్ఞానం ' అన్న సోక్రటిస్ తెలియని తాతయ్య , వేదాలు , వ్యవసాయం మాత్రమే తెలిసిన తాతయ్య . అంతే లెక్కలంటే బొత్తిగా లెక్కలేకుండా పోయింది . ఇంగ్లీష్ అంటే భూతమనే భ్రమ కొన్నాళ్ళు , రోజూ ఓ పదం నేర్చుకుందాం అన్నాడో మిత్రుడు . తిరుగులేని తాయత్తు . దెబ్బకి దెయ్యం వదిలింది .
ఈ తరం పిల్లలకి ఆనాటి బాల్యపు ఆటలు లేవు , వీడియో గేములే . ఒడిలో కూర్చోపెట్టుకుని మంచి , చెడ్డా చెప్పే బామ్మలూ , తాతయ్యలు లేరు , వుంటే వృద్దాశ్రమం లోనో , కాకుంటే వేరే ఊర్లలొనొ , వేరే ఇళ్ళలోనో ...
For every problem there is a solution , if there is one find it , if there is none never mind it ! its not at all a problem then అని ధైర్యం చెప్ప గలిగే మిత్రులూ చాలా మందికి లేరు .. ఫలితం ఒక్క మార్క్ తగ్గి నాలుగు ర్యాంకులు వెనక పడితే అమ్మ తిడుతుంధనో , నాన్న కొడతాడనో , స్కూల్ లో తాట తీస్తారనో ...టెన్షన్ , భయం ... ట్యూషన్లు , హాస్టల్స్ ..
.ఆ మధ్య హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ఓ ప్రిన్సిపాల్ నిర్వాకం నుంచి , ఇటీవల ఎలమంచిలి లో ఓ ట్యుటోరియల్ సెంటర్ నిర్వాహకుడి అఘాయిత్యం వరకూ ( అవి ఏమిటో వివరించి నా కీ బోర్డ్ కి అశ్లీలపు రాతల అపవిత్రతని అంటగట్ట లేను నేను )
యింక కలల కొత్త లోకాలని ఆవిష్కరించే కళాశాలలు , విశ్వవిద్యాలయాలు , ఉద్యోగ ప్రదేశాల లో మాత్రం మేమేం తక్కువ తిన్నాం అంటూ ... ప్రేమ పేరిట ఎమోషనల్ బెదిరింపులూ , ఆత్మ హత్యలూ ,ఏసిడ్ దాడులూ ,...హత్యాయత్నాలూ, హత్యలూ ...

సంసారాల సాగరాల అలల కల్లోలాలలో ఒక్క మునక వేసామనుకోండి ....పూటు గా తాగొచ్చి ,
వరం డాలో నిద్ర పోతున్న కట్టుకున్నావిడని లేపి లోనికి రమ్మని ఆఖరి అనుభవాన్నీ అనుమానం తో జీవితపు ఆఖరి క్షణాలనీ అందించ గలిగిన , అడ్డొచ్చిన ఆవిడ తరపు బంధువులని సైతం అక్కడికి అక్కడే నరికి వేయగలిగిన ఉత్తమోత్తముడయిన భర్త , అన్నం లో కి కూర వండి పెట్ట లేదని తల్లిని కడ తేర్చిన పుత్ర రత్నం , తనకు భారంగా మారిందని.. కన్నతల్లిని కర్కసం గా బతికుండగానే సజీవదహనం చేసి శవాన్ని సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేసిన మాననీయ మహిళా మాణిక్యం , అయిదవ తరగతి చదువుతున్న చిన్న కూతురిని .....( జుగుప్స తో వేళ్ళు వణుకుతున్నాయి ఈ సంఘటన వ్రాయడానికి ) న కామం తో కళ్ళు మూసుకు పోయిన ఒక దౌర్భాగ్యపు తండ్రి ...
యిలాంటి వెధవల వలన ... నిత్యం జరుగుతున్న దిక్కుమాలిన సంఘటనలని చానల్స్ లో చూస్తున్నా, పేపర్లలో చదువుతున్నా ... భయానికి నేనంటే భయం తగ్గుతోంది .

యివన్నీ ఒక ఎత్తు , సిద్దాంత పరమైన ( ! ? ) హత్యలు , తీవ్రవాదమ్ , రాజకీయాలు వీటి జోలికొస్తే ... వివరించేందుకు , ఈ కాలమ్ , నా కాలం రెండూ సరిపోవు , తిలక్ మాటల్లో చెప్పాలంటే ` గాంధీ గారి దేశం లో గజానికో గాంధారి కొడుకు ' భయమేస్తోందా ?

పాతిక సంవత్సరాల క్రితం అనుకుంటా ఆంగ్ల పద సంపద పెంచుకునే యత్నంలో ఓ కొత్త పదాన్ని ఉపయోగింఛి ఒక్కొరూ ఒక్కో వాక్యం చెప్పాలి అదీ ఆట ఓ మిత్రుడు చెప్పాడు ` satya sai baba is the incarnation of swami vivekananda ' అని ఆ వాక్యపు నిజానిజాల గురించి ఎప్పుడూ ఆలోచిం చ లేదు , అనవసరం అని . కానీ వివేకానందుడి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాం , మంచి english నేర్చుకోవడం కోసం . హిందూ ధర్మ శాస్త్రాల లోని మానవీయ విలువలని ప్రపంచానికి చాటడం గా ఆ పుస్తకాల సారం అప్పటికి మాకు అర్థమయింది .
సరే మరి బాబా గారి సంగతేమిటి ?
సుమారు 160 కి పైగా దేశాల నుంచి అరవై లక్షలకు పైగా భక్తులని పోనీ అనుయాయులని సంపాదించి ,వారి నుంచి లక్షల కాకుంటే వేల కోట్ల రూపాయలని సమీకరించి విద్య , వైద్యం ( ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఎక్కడయినా అత్యంత ఖరీదయినవి ఈ రెండూను ) సుమారు 1500 గ్రామాలకి తాగు నీరు సాగు నీరు అందించ గలిగిన మహనీయుడు మరణ శయ్య పై చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నప్పుడు "సత్యసాయి దేవుడయితే వీల్ చైర్ లోఎందుకు కూర్చుంటాడు సార్?" అని ప్రశ్నించిన ఏంకర్లున్న చానల్స్ చూడడమ్ ఒక ఖర్మ అయితే , ఆ ప్రశ్న కి సమాధానం యివ్వగలిగే అవకాశము , తీరికా లేక పోవడం ఒక అదృష్టం .
ఆయన మరణానికి కొన్ని వారాల క్రితమే మృత్యు మంజూష ( శవ పేటిక ) ని సైతం సిద్దం చేయించ గలిగిన మహా దార్శనికత కలిగిన మేధావుల చేతులలో వితరణ శీలులయిన అరవై లక్షల పైగా భక్తుల శ్రమ ఫలితం నిజంగా యిటు పైన నిజమయిన సేవలో సంపూర్ణం గా త్రికరణ శుద్ధి గా వినియోగించబడుతుందా ? అని ఇప్పుడు నాకు కొత్తగా పట్టుకున్న భయం.అవును.....
భయానికి బొత్తిగా నేనంటే భయం పోయింది ఈ మధ్య ఎప్పుడూ నాతోనే వుం టోంది.











Monday, June 6, 2011

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట ...

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట ...
సత్యలోకం లో ఓ అందమైన సాయంత్రం కచ్చపి తీవెలలో స్వరసుమాలు విరుస్తున్నాయి. బ్రహ్మదేవుడు తన్మయుడై ఆ రాగ పరిమళాలను ఆస్వాదిస్తున్నాడు. యింతలో మహతిని మీటుకుంటూ నారదుడు ప్రవేశించాడు , వెన్నంటే తుంబురుడూను , వీరిని చూడగానే బ్రహ్మదేముడికి భూలోకం గుర్తొచ్చింది . శూన్యం నుండి ధ్వని ప్రసరించదనీ స్పురణకొచ్చింది . తన భార్య సరస్వతికి ఎంతో ప్రియమైన ఆ వీణారావాలు భూలోక వాసులని చేరవని కొద్దిగా దిగులు చెందాడు . పాపం చతుర్ముఖుడు కదా అంతర్ముఖుడు కాలేకపోయాడు . సరస్వతీ వాహనమైన హంస ఆ దిగులు గమనించింది , తీర్చాలనుకుంది . అటూ యిటూ చూసి పుటుక్కున కచ్చపి నుండి ఓ తీవెని లాగి ముక్కున కరుచుకుని ... వైకుంఠం వైపు ఎగిరింది అలాగే పాలకడలిలో ములిగింది . లక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ఆశ్రీర్వాదాన్ని పొందింది . రెక్కలు కట్టుకుని... కైలాసానికి ఎగిరింది పార్వతి ఆశీర్వదించింది, గంగ అభిషేకించింది, శివుడు సరే సరి... తిరిగి సత్యలోకానికి చేరింది . ఆ తీవె తునకని భక్తిగా బ్రహ్మదేవుడి పాదాల ముందుంచింది . బ్రహ్మకేదో సంకేతమందింది . నవ్వుతూ మానస పుత్రుడైన నారదుడి వైపు చూసాడు . నారదుడు మహతి లోని ఓ తీవెని తీసి ఆప్యాయంగా బ్రహ్మకిచ్చాడు, అలాగే తుంబురుడూను ... ఈ మూడు తీవెలను కలిపి తను సృష్టించే కొంతమంది స్వరపేటికలలో అమర్చాడు బ్రహ్మ ...

....యిది జరిగి సుమారు 164 సంవత్సరాలైంది . త్యాగరాయ స్వామి అవతరించాడు సుమారుగా అప్పుడే శ్యామాశాస్త్రీను ...కాల క్రమేణా ...1946 జూన్ నాలుగున నెల్లూరు జిల్లాలో కోనేరమ్మపేట గ్రామం లో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శ్రీమతి శకుంతల దంపతులకి శ్రీ బాల సుబ్రహ్మణ్యం జన్మించారు .

శ్రీ బాలసుబ్రహ్మణ్యంగారికి ఇద్దరు సోదరులు అయిదుగురు సోదరిలు . మొత్తం ఎనిమిది మంది సంతానంలో ఈయన రెండవవారు . ఈయన తండ్రిగారు అప్పట్లో పేరెన్నికగన్న హరికథాపండితుడు . సంగీత సాహిత్య విశ్వరూపం హరికథ .వేదికపై పాత్రధారి ఒక్కడే పాత్రలనేకం , గాత్రధారీ ఒక్కడే ... వేదికపై `` శ్రీకృష్ణుడై పాంచజన్యం పూరించాలి , అర్జునుడై గాండీవం సంధించాలి , రథమై , గజమై , ఘీంకారమై , ఓంకారమై , నృత్యమై , గానమై .." సర్వం, సకలం తానే అయి కథ రక్తి కట్టించాలి . అలా తన తండ్రిగారు చెప్పే హరికథలలో బాల్యం నుంచీ లీనమై గాత్ర శుద్ది నే కాక పాత్ర ఔచిత్యాన్ని సరిగ్గా పట్టుకోగల హృదయ ఔన్నత్యాన్నీ పెంచుకున్నారు శ్రీ బాలు . సమాంతరంగా చదువు . తండ్రిగారి కోరిక మేరకు మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ ., లో చేరారు . 1964 లో మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు లలిత సంగీత పోటీలు నిర్వహించారు . బాలు పాల్గొన్నారు . శ్రీ ఘంటసాల గారు , శ్రీ పెండ్యాల గారు , శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు , న్యాయ నిర్ణేతలు . మొదటి బహుమతి శ్రీ బాలుగారికే . రవంత లేతగా వున్న శ్రీ బాలు గారి గాత్రం కాస్త ముదిరితే సీమాలలో అవకాసం యిస్తానన్నారు శ్రీ ఎస్.పి.కోదండపాణి గారు ఆ పోటీలో బాలుగారి పాట విని, పాడే పద్దతి నచ్చి . ...పాట మరింత ప్రాణమయింది. సార్థకమయే సాధనలో మెరీనా గాలులు మరింత పరిమళాన్ని పెంచుకున్నాయి .

దాదాపు రెండేళ్ళు నిరీక్షణ , నిరంతర సాధన . 1966 డిసెంబర్ లో శ్రీ కోదండపాణి గారు కబురు పంపారు . ఏదయినా ఓ పాట పాడమన్నారు . తనే వ్రాసి స్వరపరిచిన ` రాగమూ అనురాగము ' అనే పాటని పాడారు బాలు . మరొకటి పాడమన్నారు . తనదైన శైలిలో పాడారు బాలు పాత్రలో గాత్రాన్ని మమైకం చేయగలగడం తండ్రి గారి హరికథల వలన అబ్బిన విద్య మరి . ఆ పాడే పద్దతి నచ్చింది కోదండపాణి గారికి . శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ చిత్రంలో వీటూరి గారు వ్రాసిన ఏమి వింత మోహం ... బాలు గారి తొలి సినిమా పాటగా పల్లవించింది . అదీ ఆరంభం ...క్రమేణీ పాడిన ప్రతీ పాటలోనూ సంగీతానికి, సాహిత్యానికీ , సన్నివేశానికీ న్యాయం చేకూరుస్తూ , సన్నివేశబలానికి తగిన నటనని గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటిస్తూ వీటూరి , ఆరుద్ర , శ్రీశ్రీ , కృష్ణశాస్త్రి, ఆత్రేయ , వేటూరి సీతారామశాస్త్రి , వైరముత్తు వంటి మంచి సినీకవుల హృదయ స్పందనలను తన గుండెలో దాచుకుని గొంతులో పలికిస్తూ సుమారు నలభైవేల పాటలను , తెలుగు , తమిళ , కన్నడ , మళయాళ , హిందీ , తులు , ఒరియా , అస్సామీ , బడగ , సంస్కృత , కొంకిణి , బెంగాలి , మరాఠీ ,పంజాబీ , ఇంగ్లీష్ వంటి 11 భాషలలో పాడారు . నలభై సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు .

1981 ఫిబ్రవరి ఎనిమిదిన ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు 17 పాటలు పాడి రికార్డ్ సృష్టించిన శ్రీ బాలు తరువాత ఒకే రోజులో 19 తమిళ పాటలు రికార్డ్ చేసారు . హిందీలో ఒకే రోజున 16 పాటలు పాడి ఘనత వహించారు .

యిది గాయకుడిగా ఎస్.పి.బాలు విశ్వరూపం .
వివిధ పాత్రలలో నలభై అయిదు సినిమాలలోనూ చానల్స్ లోనూ పాత్రోచితంగా నటించారు.
ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి 29 సార్లు నంది అవార్డులని, కలైమామణి , విశ్వగానయోగి , విశ్వగానయోగి , నాదనిధి , గానగంధర్వ వంటి బిరుదులనీ పొందారు. 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ , 2009 లో సత్యభామ యూనివర్సిటీ వీరిని డాక్టరేట్ తో గౌరవించాయి .

భారత ప్రభుత్వం 2001 లో ఈయనకి పద్మశీ యిచ్చి గౌరవించింది . 2011 లో పద్మభూషణ్ యిచ్చి ఆ గౌరవాన్ని మరింత పెంచింది . ప్రతిభాపాటవాలని మించిన మంచితనం మానవీయత , మృదుస్వభావం , ఔదార్యం, బొండుమల్లెలవంటి నిండైన నవ్వు , ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన మనిషితనం ...శ్రీ బాలు గారి స్వంతం .

వీరి శ్రీమతి సావిత్రి గారు , కుమారుడు చరణ్ , కుమార్తె పల్లవి .

ఉల్లాస వేళల ఆనంద స్వరం విషాద సమయాల ఓదార్పుల వరం శ్రీ బాలు గారి పాట . నిండయిన తెలుగుతనాన్ని వర్ణించే వాక్యంలో మొదటి మూడు పదాలూ కృష్ణశాస్త్రి కవిత , బాపూ బొమ్మ , బాలూ పాట...
ఈ పద్మభూషణుడి కోసం ....భారతరత్న ఎదురు చూస్తోంది .
సర్వేజనా సుజనోభవంతు
సర్వేసుజనా సుఖినోభవంతు
శుభం జయం సదా సర్వదా ......
గాన గంధర్వుడికి జన్మదిన శుభాకాంక్షలు...

---ఆచాళ్ళ శ్రీనివాసరావు

Saturday, May 7, 2011

ప్రాణధారనే పంచింది పాలబువ్వ తినిపించింది ...



పల్లవి :
అమ్మ కడుపులో హాయిగా ఆరంభమైన గమనం
మట్టిగుండెలో ఛాయగా నిదురించు వరకు పయనం
నేనడగకనే దొరికిన వరమే అమ్మా ! ఈ జన్మ
జన్మజన్మకీ నిన్నే అమ్మగ వరమిస్తే చాలు బ్రహ్మ
చరణం :
ఆ సూర్యుడైనా ఏ పొద్దయినా నిద్దుర లేచాడా ?
సుప్రభాతమై అమ్మ పాటేదొ తట్టి లేపకుండా !
చందమామ ఒక క్షణమైనా చల్లగా కునుకు తీసిందా ?
మబ్బుల ఒడిలో జోకొట్టే అమ్మ జోల వినకుండా !
చరణం :
కడుపు మాడ్చుకుని కన్న బిడ్డలకి కడుపు నింపు తల్లి
తన కంటిపాపలో చంటిపాపలా సాకు కల్పవల్లి
కలల తేరుని విరుల తీరాల చేర్చే అల అమ్మ
గుండె అలజడిని అమృతధారగ మార్చే వరమమ్మ
చరణం :
ప్రాణధారనే పంచింది పాలబువ్వ తినిపించింది
మనిషిగా జీవించమని మరీ మరీ దీవించింది
నుదుట ముద్దాడి లాలించే అమ్మే తోడుంటే
నుదిటిరాతనే మార్చి వ్రాయగల సత్తా మనవెంటే ...
ఆ అమ్మ జన్మ సార్థకమవదా మనుషులుగా మనముంటే ...

( మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకి ప్రేమ తో ..)

Thursday, February 3, 2011

తెలుగు భాష

అమృత ధారల తేనెల సోనల
తడిసిన స్వర వీణ
పలికే పదముల పులకించని ఎద
కలదా భువనాన
ఆ వీణ మన తెలుగు భాష
రస రమ్య శ్రీ రాగ యోష ...

Monday, October 25, 2010

cry in the wilderness !

అమ్మా నాన్నా అక్కా అన్నా ఉపాధ్యాయులారా

అల్లి బిల్లీ కబురులలో మా మొరలను వినలేరా !
మా బాల్యం గాలిపటానికి మీ ఆశల సంకెలలేలా?

మా ఊహల రంగుల దారం కొస ఇదిగో అందుకొలేరా !

చ ౧ :భవితంటే బడి చదువొకటే అనుకొంటూ మీరుమ్టే

మీకోసమ్ మేం మిమ్మల్నే ప్రతిరోజూ మిస్సవుతుమ్టే
మూడు మల్లెలెత్తు సుకుమారులము

ఎన్ని యాతనలు మోసెదము ? //౨సార్లు//

చ : చందమామ కధలే చెబుతూ తాతయ్యే జో కొడుతుంటే

ఊ కొడుతూ నిదురోతాము హాయిగా తీయగా
home work
భూతమల్లే కలలోనూ భయ పెడుతుంటే

ఉలిక్కిపడి లేస్తుంటాము బేలగా బేజారుగా ..
ఏమి చెప్పమమ్మా మా యాతనలెన్నంటే ..

.

.గెలుపంటే మార్కుల వరుసన మొదటి పేరు అనుకుంటే

అరిస్టాటిలూ ఐనిస్టియనూ కుడా ఓడినట్లే

టెమ్డూల్కరూ రామానుజన్ ఎన్నడూ గెలవనట్టే

గెలుపంటే ఒక ఆనందం గెలుపంటే ఒక అభిమానం

చెరగని సిరి చిరునవ్వులకి చిరునామా అవడం గెలుపంటే

.. దారిని బ్రతుకున చూపే సిరిదీపం ఈ చదువంటే ...


-
మన్ను తడి తాకద్దంటే మాను గా ఎదిగేదేలా ?

ఆకాశం చూడొద్దoటే ఆ ఎత్తుకు ఎగిరేదేలా ?

మట్టి తో చుట్టరికాన్నీ మబ్బుతో మా స్నేహాన్నీ

దూర౦ చేసి దగ్గర కొచ్చే tuition fashion దేనికనీ

గెలుపులో ఆన౦దాన్నీ ఓడినా sportiveness నీ

మా దరి చేర్చే ఆటల 'సాయం' దూరమయీ !!

బాల్యం లో ఆట పాటలు భవితకి బంగారు బాటలు

మా బాల్యం మాకివ్వండి

ఆనందంగా చదివేస్తాం మా సత్తా చూపిస్తాo

ప్రియ భారతి ముద్దు బిడ్డలై దేశానికి పనికొస్తాం

Monday, October 11, 2010

మానస చైత్రం


చైత్ర మాసం, పశ్చిమాన పవళించిన ప్రద్యోతనుడు మేఘాల కనురెప్పలు తెరచి, కిరణాల కరాలు సాచి లోకాన్ని సాకక మునుపే శశి చల్లని చూపులకే మేను మరచిన చిరుగాలి ముగ్ధత్వాన్ని సంతరించుకున్న మల్లె మొగ్గల్ని పరామృశిం చే వేళ దూరంగా కోనేటి గట్టున ఓ నందివర్ధనం రాలి పడిన సవ్వడిని సంగీతంగా మార్చుకున్నట్టు,కదిలే నీటి అల ఏ హృ దయ లయనో పలికిస్తే పదాలు కూర్చుకున్నట్టు,దూరంగా గుడి ప్రాంగణం నుంచి సుప్రభాత గీతాలు వినిపిస్తున్నాయి. 'సాగర కెరటాలలో సంగీతం నా నువ్వే, వెన్నెల కిరణాలలో వెలుగు రేఖ నీ నవ్వే' అని ఎప్పుడో వ్రాసుకున్న పాటని శృతించుకుంటూ నడుస్తున్నాను.

రైల్వే స్టేషన్ కి చేరి ప్లాట్ఫార్మ్ టికెట్ తీయడం కోసం పర్స్ తీస్తే సూర్యం నుండి అందిన ఉత్తరం. వ్రాసే ప్రతి అక్షరంలోనూ ఆర్ద్రతలో లేఖినినద్ది విరచించిన హృదయ విపంచికా గీతాలని చిత్రించడం ఇతని శైలి. సెలవులిచ్చినప్పుడల్లా అతడు రావడమో నేను వెళ్ళడమో . ఈసారే కలిసి ఆరు మాసాలు దాటింది. అదే వుత్తరం వ్రాసాడు వస్తున్నాననీ స్టేషన్ కి మ్మనీ... టికెట్ తీసుకుని ప్లాట్ఫాం మీద సందడి లేనిచోట నిలబడి ఆ ఉత్తరాన్ని మళ్ళీ చదవడం ప్రారంభించాను.

తెల్లని కాగితంపై ఊదారంగు అక్షరాలు...నింగికొసలలో నిత్య మల్లెలు పేర్చినట్ట్లు అందంగా,ఆనందం మనసైన చందంగా...'యోగీ ! పలుకని వేణువులా శృతి మరిచిన వీణియలా ఏమిటీ మౌనం. తొలి వయసు వేగంలో జలపాతపు హోరునీ జోరునీ సంతరించుకున్న నిన్నేనా,నులివేడి న్నీ టి సెలయేటి స్తబ్ధత ఆవరించుకున్నది? అమ్మ ఒడిలో అందుకున్న ప్రేమ వయసుతో బాటు పెరిగీ ఒక దశలో ఒక అమ్మాయి వైపు దిశ మార్చుకుందనీ తెలుసు. కానీ ....ఇదంతా నీ పాతికేళ్ళ వయసు నాటి సంగతి. ప్రేమ వైఫల్యం...అది కలిగించిన వేదన...ఎక్కడో నువే అన్నట్టు 'తొణికిన స్వప్నం కనుకొలకులలో బిందురూపమున చిందులాడినా...'ప్రతీ బిందువుకీ అక్షర రూపాన్నిచ్చి,ఆవేదనకీ అపురూప రూపాలనిచ్చుకుంటూ స్నేహితుల సమక్షంలోనో, ఏకాంతంలో సాహిత్యపు సానిహిత్యంలోనో...ఒక నవ్వు పూసినా ఎదనొక్క మధురాక్షరమై పరవశాల పల్లకిలో పదమల్లికలు పరచి, సురభి సుగం ధాలు పూసి కవితా సఖిని ఊరేగించిన నీలో ఎందుకింత స్థబ్ధత ?

ఒక్కమాట చెప్పనా? దేవులపల్లి వారన్నట్లు 'బాధ ఒక వరం' అవును ఆ బాధని మధురం చేసేందుకు పదాలని పీయూష విప్రూషాలుగా మలచుకో. ప్రేమని వ్యక్తి మీద నుంచి వ్యవస్త పైకి ఫొకస్ చేయి. విశ్వ జనీనమైనది ప్రేమంటే.కులాల ఎల్లల మద్య సంసారపుగోడలు లేచో,అర్ధిక సంబంధాల చట్రాలలో వివాహ వ్యవస్త ఇరుక్కుపోయో ఆడా మగా కలిసి బ్రతకలేకపోవడం కాదు ప్రేమ వైఫల్యమంటే. వ్యక్తి వ్యధతో సంఘాన్ని పట్టించుకోకుండా ఇంట్రావర్ట్ గా కుమిలిపోవల్సిన విషయం కాదు అసలు ప్రేమలో వైఫల్యమంటే, కత్తిపోట్లూ, బాంబుబ్లాస్ట్లూ, ఆత్మహత్యలూ, ఆకలిచావులూ, మారణహోమాలూ.. అదీ ప్రేమరాహిత్యమంటే. ఎన్నికల ముందు మందు ఏరులై పారడాలూ రాజకీయాలూ శవాలపై ఏరుకునే ఓట్లూ,...ఇవీ ప్రేమరాహిత్యమంటే...అహింసాయుధం స్థానం లో మరఫిరంగులు మ్రోగడం,శాంతికపోతం గుండెలలో కత్తులు నెత్తురు చిమ్మడం, పరాకాష్టకి చేరుకున్న స్వార్ధం..ప్రేమ వైఫల్యం అంటే....

ఉత్తరం ఇంకా పూర్తి కాలేదు ఈలోగా రైలు ప్లాట్ఫార్మ్ ని సమీపిస్తున్న హడావుడి. కాఫీ సెగ మేళవించిన ప్రభాత వార్తాపత్రికల గుభాళింపు అలసటగా దిగేవాళ్ళూ హడావుడిగా రైలెక్కేవాళ్ళూ పోర్టర్లూ టికెట్ కలెక్టర్లూ పందోంపుల్లలూ ఫలహారాలూ ఆరాటం హడావిడీ అత్తగారు ఊర్లోలేనప్పుడు ఆకస్మికంగా ఆయనవైపు బంధువులొచ్చిన వంటరాని కొత్తకోడలి వంటిల్లులా వుంది ప్లాట్ఫాం.సూర్యం రాలేదు. రైలు కదిలేవరకూ చూసి వెనుదిరిగాను.

ఉత్తరంలోని మాటలే వెన్నాడుతున్నాయి.నిజమే! వ్యక్తిమీది ప్రేమకోసం వ్యవస్థ ని నిర్లక్ష్యం చేయడం సంఘపరంగా నేనిన్నాళ్ళూ చేసిన ద్రోహమేనేమో...కవిగా రచయితగా అంతో ఇంతో రాణింపూ గుర్తింపూ వుండికూడా విషాద గీతాలూ ప్రేమకధలూ తప్పితే సామాజిక స్పృహ వున్న వేమి వ్రాసాను ఫైలింగ్ ఎంతున్నా వృత్తిని మాత్రం ఏంపట్టించుకున్నాను?

...ఆలోచనల తోడుగా ఇంటికి చేరుకున్నాను. పక్కింటి వాకిట్లో పనిమనిషి కళ్ళాపి జల్లి ముగ్గేస్తోంది. ఎదురింటి సుబ్బారావు అప్పుడే వచ్చి తూలుకుంటూ తలుపుకొడుతున్నాడు. నేను తలుపు తాళం తీసి కాఫీ కలుపుకుంటుంటే అమ్మ గుర్తుకొచ్చింది.కళ్ళు విప్పగానే కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యే అమ్మ..పెళ్ళిచేసుకోమని శతపోరి విసిగి మార్పుకొసం అన్న దగ్గరకి వెళ్ళిపోయిన అమ్మ. కాఫీ తాగి స్నానాదులు ముగించి వీధిలోకి వచ్చేసరికి ఎదురింట్లోంచి అరుపులూ కేకలూ వినిపిస్తున్నాయి. ఎదురింటి సుబ్బారవు తరచు తాగొచ్చి ఇలాగొడవ పడడం మామూలే.

సుబ్బారావుది మునిసిపల్ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం. నీటో నాటో రోజూ మందుకొట్టడం, మరీ ఎక్కువయితేనో,డబ్బులు తక్కువయితేనో భార్యని కొట్టడం అడ్డొస్తే తల్లిని తిట్టడం ...ఆ ఇల్లాలు ఏడ్చుకోవడం,తల్లి తల మొత్తుకోవడం,చుట్టుపక్కల ఎవరైనా సుబ్బారావు మైకంలో కాక ఈలోకంలో వున్నప్పుడు నచ్చచెప్ప యత్నించడం మామూలే..ఇదంతా మామూలే అని బయటకి వెళ్ళేందుకు బండి తీస్తుంటే వీధి మొగలో మలుపు తిరుగుతూ సబ్ ఇన్స్పెక్టర్ సుదర్సనం వెనకే ఓ కానిస్టేబ్లూ. ముప్పయి గడపలూ అరవై సంసారాలూ మించని చిన్న వీధి మాది. ఈ వీధిలో ఇంత ఉదయాన్నే పోలీస్ వాళ్ళకి పనేంటో అర్ధంకాలేదు నాతో ఏమయినా పనున్నా కాజువల్ పలకరింపులైనా ఫోన్ చేసివుండేవాడు కదా అనుకుంటూ ఆగాను.

ఇంతలోనే ఎదురింట్లోంచి కేకల తీవ్రత పెరిగింది."సచ్చినోడా ! నీ తాగుడు కాదు కానీ సంసారం గుల్ల అయిపోతోందిరా ! చంటిపిల్లాడికి చుక్కల మందు వేయించడానికి వెళ్ళడానికి రిక్షాకైనా డబ్బుల్లేవింట్లో,వంటి వంటిడు బంగారం నీ యధానే పెట్టిందది. ఇంకేమున్నాయని ఆ మెళ్ళో తాడూ,తాళిబొట్టూ తప్ప...అవీ ఇచ్చేయమంటావేరా బ్రష్టుడా..." అంటోంది తల్లి. "చుక్కలమందెందుకే ఆడు నా కొడుకు సుక్కేసి పెంచుతానాణ్ణి. ఆరొందలు అరువు పెట్టి కొన్నానే బాటిల్. పదోగంటకి షాపు తీసేసరికి ఇచ్చేయాల డబ్బులు లేకపోతే పరువూ దక్కదు మళ్ళీ అరువూ దక్కదు...దా ఆ తాళి ఇలా ఇచ్చేయి..రేయ్ కన్నా... నోరు తెరూ అంటున్నాడు సుబ్బారావు...కేర్ మన్న ఏడుపు వినిపించింది. ఇంక ఆగలేకపోయాను. బండి స్టాండు వేసి ఎదురింట్లోకి పరుగెత్తాను.

కానీ అప్పటికే ఆలస్యమయింది. సుబ్బారావు మెడ తెగి నేల మీద రక్తపు మడుగులో పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు, వుయ్యల్లో బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. పక్కనే తెరిచిన విస్కీ సీసా. చేతిలో కత్తి పీటతో నిశ్చేష్టురాలై అయోమయంగా నిలబడి వుంది సుబ్బారావు తల్లి. పక్కనే కొత్త మామిడికాయలు, కత్తిపీటకి పదునిచ్చింది మేమేననుకుంటూ...ఏవండీ...ఏవండీ ...తాళే కదండీ...ఇదిగోనండీ మీరుంటే చాలండీ... అంటూ మెడలో తాళి తీసి సుబ్బారావు చేతిలొ పెట్టి పిడికిళ్ళు మూస్తూ అయోమయంగా చూస్తోంది అతడి భార్య. ప్రేమమైకంలో పడి లోకంలో దేనికీ చలించని రాక్ హార్టెడ్ గా కుటుంబంలో ముద్ర పడిన నాకే ఆ దృశ్యం దుర్భరంగా భయానకంగా అయోమయంగా వుంది.

సూర్యం వుత్తరంలో మాటలే గుర్తుకొస్తున్నాయి. ప్రేమంటే వ్యవస్తని పట్టించుకోకపోవడం కాదు. alone in crowd and alone in solitude అనుకుంటూ విరాగిలా ఒంటరిగా జీవశ్చవంలా బ్రతకడం కాదు. తెరిసాకి సేవలో దొరికిన ప్రేమ, మార్క్స్ కి సామాన్యుడిపై వున్న ప్రేమ, సిద్దార్దుడిని బుద్దుడిని చేసిన ప్రేమ...అయిదు నిమిషాల ముందు లోపలకి వచ్చివుంటే అన్నప్రాసనైనా కాని బిడ్డ నోట్లో ఆల్కహాల్ పోసిన ఓ వ్యసన బానిస బ్రతికి కనిపించేవాడు. కోడలి తాళి తెంపే కొడుకుని,కన్న కొడుకు నోటిలో పాలసీసాకి బదులు మందుసీసా వుంచే మూర్ఖుణ్ణి అడ్డుకోవడానికి చేతిలో వున్న కత్తిపీట నెత్తిన ఓ తల్లి ఆవేశాన్ని ఆపగలిగే వాడిని.

అప్పటికే వచ్చిన పోలీసులూ ఆశ్చర్యంనుండి తేరుకుని.."సారీ బాస్ మైత్రీ సంఘం మీటింగ్ కి నిన్ను గెస్ట్ గా పిలుద్దామని వచ్చాం వుదయాన్నే మర్డర్ కేస్ తగిలింది...'అంటున్నాడు ఎస్.ఐ;ఇద్దరం యూనివెర్సిటీ లో రూంమేట్సం. నేనేమీ వినటం లేదు. సుబ్బారావు తల్లిని ఎలా రక్షించాలా అనే నా ఆలోచనంతా. అవును భారతీయ న్యాయ శాస్త్రం చాలా గొప్పది. దేశ ప్రధాని అధికార పరిధిని సైతం నియంత్రించగలిగినది. దేశ ప్రధానిని పట్ట పగలు కాల్చి చంపిన వారిని సైతం వురి నించి తప్పించగలిగినది. శిక్షా స్మృతి లో ఓ చాప్టర్ గుర్తుకొచ్చింది. గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్... పరవాలేదు పార్వతమ్మ గారిని శిక్ష నుండి తప్పించవచ్చు లేదా వీలయినంత చిన్న శిక్ష పడేలా ప్రయత్నించవచ్చు. సుబ్బారావు భార్యకి ఏదయినా ఆధారం కోసం ప్రయత్నించాలి. కానిస్టేబుల్ ని అక్కడే వుంచి అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి ఎస్.ఐ నేనూ ఇంటికి వస్తే ..ఫోన్ బల్ల మీద తెరచిన వుత్తరంలో చివరి పదాలు a word from a writer's lit brain is but a golden grain అవును ఈ సంఘటననే కధ గా మలిస్తే...విశ్వవ్యాప్తం కాలేక కేవలం వ్యక్తి పరమైన ప్రేమ కూడా స్వార్ధమేననీ బ్రతుకుని అస్తవ్యస్తం చేస్తుందనీ...మనిషి మీదనయినా మద్యం మీదనయినా ...మమకారం వ్యసనమయితే వ్యక్తినే కాక వ్యవస్తనే అవస్తలపాలు చేస్తుందనీ ఎవరికి అర్ధమయినా చాలు...మానస చైత్రాలు విరియడానికి...

***


Monday, September 13, 2010

స్కూల్ పిల్లల స్వగతం ...

ఉదయం కోరే గగనం
ఎపుడూ సాయంత్రం వద్దనదే
రేయినసలు వద్దనదే
గమ్యం చేర్చే గమనం ఏదీ
చదువొకటే హద్దనదే
ఆటలసలు వద్దనదే !!
కూలి బాలలకి సైతం
సాయంత్రం ఆట విడుపుగా
ఆనందం కాస్త వుందిగా
స్కూలు పిల్లలకి పాపం
ఆ టైమూ జైలు పిలుపుగా
ట్యూషన్ల సైరనుందిగా
హోంవర్కుల ఖైదు అది కదా !
కాలం వేగం కాళ్ళకి రాదే
ఆటలాడకుంటే యిపుడూ
సత్తాగా బ్రతికే సత్తువ
తేలేదే చదువొకటే ఎపుడూ ...
భయమేస్తోందమ్మా
బడి చదువులంటె మాకు ..